Site icon NTV Telugu

Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్

Mojtabakhamenei

Mojtabakhamenei

Mojtaba Khamenei: ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించి మరింత భీకరంగా మారుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, తన మొదటి విదేశాంగ విధాన ఉత్తర్వులోనే నిప్పులు చెరిగారు. శాంతి చర్చలకు తావులేదని, శత్రు దేశాలు బేషరతుగా లొంగిపోతేనే యుద్ధం ఆగుతుందని ఆయన ఈ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న అన్ని కాల్పుల విరమణ ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

READ ALSO: Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్

ఒక సీనియర్ ఇరాన్ అధికారి సమాచారం ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్ ముందు మోకరిల్లి, లొంగిపోవడమే కాకుండా.. వాళ్లు చేసిన నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని మొజ్తబా డిమాండ్ చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారని చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా శత్రు దేశాలను ఆర్థికంగా దెబ్బతీయవచ్చని మొజ్తబా వ్యూహరచన చేశారు. వారం క్రితమే తన తండ్రి అలీ ఖమేనీ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా, ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటీవలి దాడుల్లో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని ఇరాన్ వర్గాలు అంటుంటే, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని అమెరికా నిఘా వర్గాలు వాదిస్తున్నాయి. తాజాగా జరిగిన సమావేశానికి కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారా లేదా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారా అనే దానిపై స్పష్టత లేదు.

ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా, అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలను తిరస్కరించడంతో పరిస్థితి మరింత ముదురుతోంది.

READ ALSO: Health Tips: మధ్యాహ్నం కునుకు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Exit mobile version