Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు

Hormuz Open

Hormuz Open

Iran Missile Attack: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు గల్ఫ్ రీజియన్‌లో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) లో ఇరాన్ జరిపిన క్రూయిజ్ క్షిపణి దాడుల కారణంగా ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఓమన్ ప్రాంతీయ జలాల్లోని జలసంధి దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన ‘మొంబాసా’ (Mombasa), ‘అల్ బహియా’ (Al Bahiyah) అనే రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో మొంబాసా నౌకలో విధులు నిర్వహిస్తున్న భారతీయ పౌరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఎనిమిది మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. వీరిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ దేశస్థులు ఉన్నట్లు యూఏఈ తెలిపింది. క్షిపణి దాడుల వల్ల రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంటలు చెలరేగి నష్టం వాటిల్లినప్పటికీ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండించిన యూఏఈ.. అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఘోరంగా ఉల్లంఘించిందని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తగిన రీతిలో బుద్ధి చెప్పే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. మరోవైపు, ఓమన్‌లోని ఖల్హత్ ప్రాంతానికి ఈశాన్యంగా 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న మరో ట్యాంకర్‌పై కూడా గుర్తుతెలియని ప్రొజెక్టైల్ (క్షిపణి లాంటి వస్తువు) దాడి జరిగినట్లు బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) సంస్థ నివేదించింది. ఈ దాడి వల్ల నౌక ఇంజిన్ రూమ్ దెబ్బతిన్నప్పటికీ, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నివేదిక యూఏఈ ట్యాంకర్లకు సంబంధించినదా లేక వేరే ఘటనదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

అమెరికా ఆంక్షలు.. ముదిరిన వివాదం:
ఈ దాడుల వెనుక బలమైన నేపథ్యం ఉంది. ఇరాన్ నౌకాయానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దిగ్బంధాన్ని (Blockade) విధిస్తున్నట్లు ప్రకటించడం, అలాగే ఇరాన్ తీరప్రాంత నిఘా వ్యవస్థలు, డ్రోన్, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా అమెరికా సైన్యం వరుసగా మూడో రోజు సైతం వైమానిక దాడులు జరపడంతో ఇరాన్ ప్రతీకారంగా ఈ దాడులకు తెగబడింది. అయితే తమ సముద్ర మార్గాలపై నిర్ణయాధికారం తీసుకునే హక్కు అమెరికాకు లేదని ఇరాన్ సైనిక అధికారులు స్పష్టం చేస్తున్నారు.