ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్ను కెప్టెన్ పాటీదార్ వదిలేయడంతో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37; 17 బంతుల్లో 4×4, 3×6), టిమ్ డేవిడ్ (37; 20 బంతుల్లో 2×4, 4×6) మెరుపులు మెరిపించారు.
ఆర్సీబీకి హోం అడ్వాంటేజ్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఐదు మ్యాచ్లలో 3 విజయాలు సాధించగా.. అవన్నీ బయటి మైదానాల్లోనే కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్పై చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో ఆర్సీబీ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడింది.
అంతకుముందు ఈ చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ 44 మ్యాచ్ల్లో ఓడింది. డీసీ రికార్డు ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసింది. ఈ జాబితాలో ఈడెన్ గార్డెన్స్లో 38 మ్యాచ్ల్లో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మూడవ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్-18 టైటిల్ దిశగా సాగుతున్న ఆర్సీబీకి డీసీ కళ్లెం వేసింది. మరోవైపు ఐపీఎల్ 2025లో డీసీ జోరు కొనసాగుతోంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడగా.. ఢిల్లీ మాత్రం అజేయంగా ఉంది.