Revanth Reddy: రేవంత్రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇద్దరు నేతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య కొంతకాలంగా ఎడం పెరిగిన సంగతి తెలిసిందే. తమది తోడికోడళ్ల పంచాయితీ అని… పొద్దున తిట్టుకుంటాం మళ్లీ కలిసిపోతామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్రెడ్డి పాదయాత్రకు మద్దతిస్తున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంకా పదేళ్లు అయ్యాకా… రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అన్నారు. ఇప్పట్లో రేవంత్ని పదవి నుంచి దింపడం సాధ్యం కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి
అయితే మీడియా ఓ అడుగు ముందుకేసి మీలో పెద్దకోడలు ఎవరని ప్రశ్నించగా, ఇప్పుడు కలిశామో లేదో అప్పుడే తామిద్దరి మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తోందంటూ మీడియాపై రేవంత్ ఛలోక్తి విసిరారు. జగ్గారెడ్డి స్పందిస్తూ, తాను రేవంత్ గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని స్పష్టం చేశారు. ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడే అలవాటు తనకు లేదని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడబోనని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఎన్ని అనుకున్నా తాము కలిసుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, రేవంత్ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి సీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జగ్గారెడ్డి, కొప్పుల రాజు, సునీల్ తదితర నేతలు హాజరయ్యారు. ధరణి సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. రాబోయే ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది.