HYDRA: హైదరాబాద్లోని నార్సింగి ప్రాంతంలో చెరువుల పరిరక్షణ చర్యలను హైడ్రా అధికారులు వేగవంతం చేశారు. ముష్కి చెరువులో జరిగిన ఆక్రమణలపై దృష్టి సారించిన అధికారులు ఉదయం నుంచే రంగంలోకి దిగారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కి చెరువులో 10 ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్లు గుర్తించిన హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువు హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణకు గురైన చెరువు భూమిలో నిర్మించిన భవనాలు, ఇతర నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చెరువు పరిధిలో ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. చెరువు భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించిన వారిపై సైతం అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూములు, జలవనరుల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ముష్కి చెరువు ఆక్రమణల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, చెరువుల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు.
ఇక, ముష్కి చెరువు FTL పరిధిలో ఉన్న ఆక్రమణలను పది రోజుల్లో తొలగించాలని గతంలో హైడ్రా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో నార్సింగి సర్కిల్ పరిధిలోని మై హోమ్ అవతార్ సమీపంలో ఉన్న ముష్కి లేక్ను అధికారులు సందర్శించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొనసాగుతున్న ఆక్రమణలపై సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అక్కడి భూముల యజమానులు, నివాసితులతో అధికారులు నేరుగా మాట్లాడారు. ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. గత రెండు నెలలుగా పలుమార్లు నోటీసులు జారీ చేసి ముందస్తు సమాచారం అందించామని అధికారులు తెలియజేశారు. స్థానికుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ఇది చివరి అవకాశం అని స్పష్టం చేశారు. తాజాగా చెరువు చుట్టూ కంచె నిర్మాణం చేపడుతున్నారు.
