Hyderabad: హైదరాబాద్లో మరోసారి నేపాలి గ్యాంగ్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ చోరీ నగరంలో సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదుతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాల్కు చెందిన కమల్, విమలా దంపతులు పనికి చేరారు. వ్యాపార అవసరాల నిమిత్తం ప్రకాష్ కొద్ది రోజుల క్రితం ముంబైకి వెళ్లగా, కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో లేకపోవడంతో ఈ దంపతులు పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కనిపించలేదు.
అదే సమయంలో ఇంట్లోని రెండు చోట్ల భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు, వజ్రాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. పూజా గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసుతో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. చోరీకి పాల్పడిన నేపాలి దంపతులే నగలతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు బృందాలను నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపినట్లు సమాచారం. మరోవైపు ఈ దంపతులను ఉద్యోగంలోకి తీసుకువచ్చిన వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాభరణాలు, నగదు విలువపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి లెక్కలు తేలిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న దంపతులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

