Miss World 2025: ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ ఈనెల 10 నుండి 31 వరకు జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 109 దేశాల నుండి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. అయితే, ఇతర దేశాల నుండి మరికొంతమంది పోటీదారులు ఇంకా వచ్చే అవకాశముంది. రేపటిలోగా మొత్తం అభ్యర్థులు నగరానికి చేరుకోనున్నారు. ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెన్నా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం విశేషం. విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, కళాకారులు, ఉద్యమకారులుగా ఉన్న పోటీదారులు తమ దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పోటీల్లో పాల్గొనే పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గత ఏడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా.. ఈ ఏడాది మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్ లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు.. ముఖ్యంగా తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది.