Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు

Cyber Crime

Cyber Crime

Hyderabad Cyber Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందజేస్తున్న ముఠాల గుట్టురట్టు చేసిన పోలీసులు, 10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అలాగే సైబర్ నేరాలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న 30 మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో కూడా రెండు విడతల్లో ఆపరేషన్ ఆక్టోపస్‌ను నిర్వహించారు. మొదటి విడతలో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు అందిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోగా, ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 ద్వారా పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు, సిబ్బందిపై దృష్టి సారించారు. ఇప్పుడు తాజా ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందజేస్తున్న నెట్వర్క్‌లను పూర్తిగా బట్టబయలు చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఆపరేషన్ ఇంకా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.