రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షానికి పలు చోట్ల రహదారులు దెబ్బతినగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇక సింగరేణి ఏరియాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపిలేని వానలకు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెంలోని సింగరేణి ఓసీల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.. శ్రీరాంపూర్, గోదావరిఖని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.