NTV Telugu Site icon

AP Weather: ఏపీకి భారీ వర్ష సూచన.. ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్

Ap Weather

Ap Weather

AP Weather: బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడనుంది. ప్రస్తుతం వాయుగుండం పూరీకి 70 కిమీ, గోపాలపురికి 130, కళింగపట్నానికి 240కిమీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్రకు భారీ నుంచీ అతిభారీ వర్ష సూచన తేసింది. ఏలూరు, అల్లూరి జిల్లాలలో అత్యధికంగా వర్షాలు పడతాయని రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, అమలాపురం, కోనసీమ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

Read Also: World Kamma Mahasabhalu: ఈ నెల 20, 21 తేదీల్లో ప్రపంచ కమ్మ మహాసభలు

రాయలసీమ జిల్లాలలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది… భారీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మోహరించినట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నవాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.