Harry Brook: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బ్యాచ్లో చివరకు భారత్ గెలిచి ఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్ సైతం వీరోచిత పోరాటం చేసింది. చివరివరకు పోరాడి కేవలం ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు సారథి హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తన వల్లే జట్టు ఓటమి పాలైందని.. దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. సంజూ శామ్సన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వదిలేయడం మ్యాచ్ మలుపు తిరిగిన క్షణమని స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం తన పొరపాటును అంగీకరించాడు బ్రూక్. సాధారణంగా క్యాచ్లు మిస్ చేయకుండా పట్టిన జట్టే మ్యాచ్ గెలుస్తుందని చెప్పే మాట నిజమన్నాడు. కానీ తమకు అదృష్టం కలిసిరాలేదని వ్యాఖ్యానించాడు. ఫీల్డింగ్లో కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయని, అవే చివరకు జట్టుకు నష్టాన్ని తెచ్చాయని అన్నాడు.
READ MORE: Iran-Gulf War: గల్ఫ్లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయంపైనా బ్రూక్ వివరించాడు. “పిచ్ తాజాగా ఉండడంతో మొదట్లో బౌలర్లకు కొంత సహాయం ఉంటుందని భావించాం. సెకండ్ ఇన్నింగ్స్లో తేమ ప్రభావం ఉండొచ్చని ఊహించి ముందుగా బౌలింగ్ చూజ్ చేసుకున్నాం. కానీ పిచ్ బ్యాటర్లకు బాగా సహకరించింది. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోయారు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఎదుట చిన్న తప్పిదం చేసినా బంతి వెంటనే మైదానం బయటకు వెళ్లిపోతుంది. భారత్ బ్యాటర్లు అలాంటి అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు.” అని వెల్లడించాడు. ఇక ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెతెల్ అద్భుతంగా పోరాడాడు. ధైర్యంగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ జట్టును పోటీలో నిలిపాడు. బెతెల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన బ్రూక్ స్పందించాడు. అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో బెతెల్ ఇంగ్లాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. మొదటి బంతి నుంచే ధైర్యంగా ఆడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించాడని చెప్పాడు.
READ MORE: Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!