ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటును వినియోగించుకున్నారు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. అయితే నలుగురు సభ్యులు మాత్రం టీడీపీకి ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే జనసేన సభ్యుడు కూడా పార్టీని వీడారు. కాగా, ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత నేపథ్యంలో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. మరోవైపు టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయితే అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డ మాట్లాడుతూ.. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారనేది పూర్తి అవాస్తవమన్నారు.
Also Read : Gutha Sukender Reddy: చైర్మన్ జనార్దన్ రెడ్డి హానెస్ట్ పర్సన్
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. అసలు టీడీపీతో టచ్లో ఉండాల్సి అవసరం తమ పార్టీ నేతలకు లేదని, చంద్రబాబు ఏం చేసినా ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలు వైసీపీ గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రచారం చేస్తోన్నట్లుగా తమ పార్టీలో అసంతృప్తులు లేరని క్లారిటీ ఇచ్చారు. అనంతరం హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీ తో టచ్ లో లేరన్నారు. ఇదంతా టీడీపీ మైండ్ గేమ్ అని ఆమె వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు అంటేనే టీడీపీకి సంఖ్యా బలం లేదని స్పష్టం అవుతోందని, ఏడు స్థానాలను వైసీపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.