హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది. అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజును సన్మానించారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ.. ఎఫ్ఎన్ సీసీ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. నిర్మాత , ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజును సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఆయన తన వంతు ప్రయత్నం చేయడం అభినందనీయం. ఎఫ్ ఎన్ సీసీ లీజ్ గడువు మరో మూడేళ్లలో ముగుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ లీజ్ ను పొడగించాలని కోరుకుంటున్నా. సీఎం కూడా మన క్లబ్ మెంబరే. ఆయన డెవలప్ చేయాలనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాలతో ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తే ఇండస్ట్రీలో రాబోయే తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది.” అని కేఎస్ రామారావు పేర్కొన్నారు.
READ MORE: Team India Schedule: స్వదేశంలో జరిగే టీమిండియా మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. వైజాగ్లో మ్యాచ్
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. “ఎఫ్ ఎన్ సీసీ మనకున్నబెస్ట్ క్లబ్. సిటీ మధ్యలో ఉంటూ మనకు వ్యాయామం, ఎంటర్ టైన్ మెంట్ కోసం బాగా ఉపయోగపడుతోంది. నేను 1996 లో ఎఫ్ ఎన్ సీసీ క్లబ్ సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి దాదాపు ఈ 30 ఏళ్లలో ఎఫ్ఎన్ సీసీ ఎంతో అభివృద్ధి చెందింది. అందుకు కేఎల్ నారాయణ, కేఎస్ రామారావు వారి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారు. కేఎస్ రామారావు చెప్పినట్లు ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అది చాలా చిన్న విషయం ఒప్పుకుని చేస్తారు.” అని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొ్న్నారు.