Goshamahal MLA Raja Singh warns newcomers to BJP: బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అని చెప్పారు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరని పేర్కొన్నారు. బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి అని రాజా సింగ్ సూచనలు చేశారు. ఇటీవల రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేని కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
‘బీజేపీలో వేరే పార్టీ నుంచి చాలామంది చేరుతున్నారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం. బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, రాసి కూడా పెట్టుకోండి. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తదని గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో ఈ రోజు మీరు చేరుంటారు కదా. మొదట్లో ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి. కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలి’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
Also Read: World Cup 2025: అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్
‘మా అసెంబ్లీలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. మా జిల్లా, డివిజన్, నియోజకవర్గంలో వాళ్ల వ్యక్తి ఉంటాడు. మేము కోరుకున్నా మమ్మల్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయాము. గోషామహల్ అసెంబ్లీ నుంచి బీజేపీలో చేరేముందు కొంతమందితో మీరు మాట్లాడి.. చేరిన తర్వాత ఏమైతదని కనుక్కోండి. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి.. చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వెళ్లిపోయారో కనుక్కోండి. నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే?.. అలాంటి వారితో ఒక్కసారి మాట్లాడండి. హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో బీజేపీ పార్టీ కొందరి వల్ల సర్వనాశనం అవుతోంది. బీజేపీలో మేము ఏది చెప్తే అదే అయితది, మేము ఏది రాసితే అదే రాజ్యమైతది అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్యకర్తల ఆశీస్సులతో బీజేపీ తెలంగాణను పాలిస్తుంది. తెలంగాణలో సీఎం బీజేపీ నుంచే వస్తారు’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చారు.
