గన్నవరం టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ సీనియర్ నేత, గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు పొట్లూరి బసవరావు జన్మదిన వేడుకలు వేదికగా విభేదాలు బయటపడ్డాయి. బసవరావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఫోటోను ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే గన్నవరంలో టీడీపీ సీనియర్ లీడర్లను పక్కన పెట్టారని, వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెత్తనం చేసిన వారే ఇప్పుడు యార్లగడ్డ దగ్గర పెత్తనం చేస్తున్నారని బసవరావు ఆరోపించారు. తనకు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా అవకాశంను ఎంపీ కల్పించడంపై ఎమ్మెల్యే ద్వేషం పెంచుకున్నారని చెప్పుకొచ్చారు.
Also Read: YS Jagan: చంద్రబాబు గారూ.. ఒక్క దీపం అయినా వెలిగిందా?
‘యార్లగడ్డ వెంకటరావు కు కాంట్రవర్సీ చేయడం తప్ప.. అభివృద్ధి మీద ద్యాస ఉండదు. గన్నవరంలో అనేక మంది ఎమ్మెల్యేలు పని చేసినా వెంకటరావు బాగా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అభివృద్ధి పక్కన పెట్టి.. అన్ని కాంట్రవర్సీ మాట్లాడతారు. వంశీ దగ్గర పెత్తనం చేసిన వారే ఇప్పుడు వెంకటరావు దగ్గర పెత్తనం చేస్తున్నారు. గన్నవరం సీనియర్ లీడర్ల మీద ఆయన ద్వేషం పెంచుకున్నారు. నాకు ఎయిర్పోర్ట్ కమిటీ మెంబర్ ఇవ్వటంతో.. ఎంపీ, నా మీద యార్లగడ్డ ద్వేషం పెంచుకున్నారు. సీనియర్లతో సంబంధాలు యార్లగడ్డ వదిలేశారు. పార్టీ కోసం జైలుకి వెళ్లిన వారికి కూడా వెంకటరావు దగ్గర ఆదరణ లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా కొందరు నేతలను ఎమ్మెల్యే పిలవటం లేదు, మాట్లాడటం లేదు. టీడీపీ వాళ్లు అంటే యార్లగడ్డకి నచ్చదు’ అని పొట్లూరి బసవరావు అన్నారు.