కరీంనగర్లో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లోని మల్టీప్లెక్స్ ధియేటర్ లో మంత్రి గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎంపి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సినిమా వీక్షించారు. అయితే.. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరించేందుకు నేటి పాలకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ చరిత్రను కించపరిచే విధంగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. మహాత్మా గాంధీని చంపిన వారిని పొగడడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలతోపాటు ఇతర ఇండస్ట్రీలను ప్రైవేటీకరించడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. దేశం గట్టి పునాదులపై నిర్మించబడిందని, గత చరిత్రను నేటితరం తెలుసుకోవాలన్నారు. 2047 శతా ఉత్సవాల నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలువనుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే.. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని భారత స్వతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.