Kiran Kumar Reddy: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి.. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన సంస్కృతి లేదు.. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నాయన్నారు.. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన.. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. బీజేపీలో ఎందుకు చేరానో ఇప్పటికే స్పష్టంగా చెప్పాను.. అరవై సంవత్సరాలు పైన మా కుటుంబం కాంగ్రెస్ లోనే కొనసాగాం.. వివిధ పరిణామాలు వల్ల రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం.. విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు అనుగుణంగా నడవాలి.. రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో మళ్లీ కాంగ్రెస్ లో చేరాను అని తెలిపారు. కానీ, నాయకులు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పని చేయాలని చూశాను.. కానీ, అక్కడ నిర్ణయాలు ఒక్కో రాష్ట్రంలో పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఉందన్నారు.
నాకు, రాహుల్ గాంధీకి మధ్య కొన్ని అంశాల పై చర్చ జరిగిందని గుర్తుచేసుకున్న కిరణ్కుమార్రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఇస్తాం అన్నా.. వద్దు అని చెప్పా అన్నారు. నీళ్లు బాటిల్ నుంచి పడకముందే జాగ్రత్త ఉండాలి.. కానీ, కింద పడ్డాక.. మళ్లీ ఆ నీళ్లను సీసాలో పోయలేం అనే విషయాన్నే వాళ్లకి చెప్పానన్నారు. అయినా అందరం కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెంచాం.. అయితే, కాంగ్రెస్ బలోపేతం అవుతున్న సమయంలో టీడీపీతో పొత్తుకు వెళ్లారని మండిపడ్డారు. ఎవరినీ అడగకుండా, చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే తాను బయటకి వచ్చానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన నచ్చి.. ప్రజలకు మంచి చేయవచ్చనే నమ్మకంతో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.
మా నాన్నకాలం నుంచి నేను రాజకీయాల్లో ఉంటున్నా.. ఇందిరా గాంధీ సమయం నుంచి కాంగ్రెస్ బలోపేతం అయిన పరిస్థితి కూడా వాళ్లకి చెప్పా.. అయినా కాంగ్రెస్ బలోపేతంపై వారు దృష్టి పెట్టలేదని విమర్శించారు కిరణ్కుమార్రెడ్డి.. బీజేపీ గ్రామ స్థాయిలో బలం పెంచుకునే కార్యక్రమం చేపట్టింది.. 1984లో దేశంలో బీజేపీకి రెండు సీట్లు ఉంటే.. కాంగ్రెస్ కి404 సీట్లు ఉండేవి.. అదే 2014లో ఏడు శాతం నుంచి 31 శాతం బీజేపీకి ప్రజా మద్దతు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 19.3 శాతం ఓట్లు, 44 సీట్లు వచ్చాయన్న ఆయన.. 2019లో బీజేపీకి 303, కాంగ్రెస్ కి 52 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నికలలో గెలుపు, ఓటమి సహజం.. అయినా.. పరిస్థితిని బట్టి నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రజల మధ్యన నేను ఉండాలా? లేదా? అని ఆలోచించా.. కాంగ్రెస్ వల్ల ప్రజలకు చేరువ కాలేనని అర్ధం అయ్యిందన్న కిరణ్.. బీజేపీలో ఉంటే ప్రజలకు దగ్గర కావచ్చనే నేను.. బీజేపీలో చేరానని వెల్లడించారు. బీజేపీకి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. వారు ఎలా నన్ను ఉపయోగించుకుంటారో చూడాలన్నారు. బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటే నాది కూడా అదే స్టాండ్ అని స్పష్టం చేశారు. అమరావతి విషయంలో బీజేపీ నిర్ణయాలే నా నిర్ణయం అన్నారు బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి.