మీ ఇంట ప్యాకెట్ పాలు వాడుతున్నారా? పిల్లలకు కూడా అవే పడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.,…ఇప్పుడు మనం వాడుతున్న పాలలో విభ్రాంతికర విషయాలు బయటకు వస్తున్నాయి. శవాలకు వాడే కెమికల్ ను పాలల్లో కలుపుతున్నారనే చేదు నిజాలు బయటపడుతున్నాయి. యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్ ను పాలలో కలుపుతున్నట్లు తేలింది. బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్ లో పాలను టెస్ట్ చేయటంతో అసలు నిజం బయటపడింది.
శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్ పాలల్లో ఉపయోగిస్తున్నారని తేలింది. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పగిలిపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్ వాడుతున్నారు. ఈ విషయాన్ని పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు కడెం కుమార్ యాదవ్ అధికారుల ఎదుట అంగీకరించారు. ఈ కేంద్రానికి రోజూ 600 లీటర్లకు పైగా పాల సరఫరా జరుగుతుంది. కుమార్ యాదవ్ పాలలో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్ కలిపి ఎక్కువ పాలు తయారు చేస్తున్నాడని అధికారులు తెలిపారు.
Read Also: MLC Kavitha: హైదరాబాద్లో సంక్రాంతి వేడుకలు.. భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
ఆ పాలను ప్యాక్ చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్ లోని హోటల్ కి తరలిస్తున్నాడు. దీంతో కుమార్ యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు బీబీనగర్ మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఫోన్ చేసినట్లు తెలిసింది. పర్మిషన్ లేకుండా పాల వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరిపైనా కేసు ఫైల్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురంలో ఇటీవల కల్తీ పాల తయారీ వెలుగులోకి వచ్చింది. . దీంతో బీబీ నగర్లోని టోల్గేట్ వద్ద ఎస్ఐ సహకారంతో యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లో వాడే పాలల్లో ఈ కెమికల్ ఉందని తెలిసి వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కెమికల్ వాడడం వల్ల పిల్లలపైనే కాదు పెద్దలపై కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ పాలు వాడడం వల్ల జీర్ణకోశ, కాలేయ సంబంధమైన వ్యాధులతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. పిల్లలకు జీర్ణ సంబంధమయిన ఇబ్బందులు, విరేచనాలు, వాంతులు, మెదడు సంబంధమయిన వ్యాధులు కలుగుతాయి. పాలను కల్తీ చేయడం అంటే తీవ్రమయిన నేరంగా పరిగణించాలి.. అలాంటి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయించాలి.
Read Also: Jabardasth Varsha: వర్ష నీ డ్రస్ అక్కడ చిరిగింది.. తెలిసే వేసుకున్నావా?