Falcon Scam: ఫాల్కన్ స్కామ్లో కీలక పురోగతి లభించింది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్దీప్ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్దీప్పై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) జారీ చేయడంతో, అతడు భారత్లో అడుగుపెట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లు, ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి భారీ మొత్తంలో నగదు కొట్టేసినట్లు విచారణలో తేలింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే అమర్దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని అరెస్ట్ చేసిన అధికారులు, ప్రధాన నిందితుడైన అమర్దీప్ కోసం అంతర్జాతీయ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అమర్దీప్ను అదుపులోకి తీసుకోవడంతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.