అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. శీలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తనపై జరిగిన దాడి ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తనను దారుణంగా కొట్టారని చెప్పాడు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశారని.. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారని తెలిపాడు. వదిలేయమని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలాడినా వినిపించుకోలేదని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బోరున ఏడ్చాడు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
‘మంత్రి సుభాష్ తండ్రి సత్యం నన్ను దారుణంగా కొట్టారు. గ్రామ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో ప్రశ్నించానని పిలిపిస్తే వెళ్ళాను. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారు. నేను టీడీపీ కార్యకర్తను, వైసీపీలో నుంచి వచ్చిన వాళ్లకు పదవి ఇచ్చారని ప్రశ్నించాను. నాతో రాత్రి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. నన్ను వదిలేయమని మంత్రి తండ్రి సత్యం కాళ్లు పట్టుకుని బతిమాలాను. నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. డాక్టర్ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించి నన్ను పంపించేశారు. మంత్రి సుభాష్ నా కొడుక్కి ఉద్యోగం ఇస్తాను, ఈ విషయాన్ని వదిలేయండని అంటున్నారు. ఇప్పుడు రామచంద్రపురం సీఐ వచ్చి నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయిందని చెప్తున్నారు’ అని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చెప్పారు.