NTV Telugu Site icon

Janasena: పవన్‌కళ్యాణ్‌, కొణతాల రామకృష్ణ భేటీ.. త్వరలో జనసేనలోకి!

Konathala Ramakrishna

Konathala Ramakrishna

Janasena: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం బరిలోకి దిగాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు. తన ఎంపీ టికెట్ ఇవ్వాలని కొణతాల ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా కొణతాల రామకృష్ణ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంచిరోజు చూసుకొని ఈ నెలలోనే జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులపై పవన్ -కొణతాల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

Read Also: CM YS Jagan: అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ నేతగా, మంత్రిగా శాసించిన నేత. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడంతో కొణతాల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొణతాలకు పార్టీ హైకమాండ్‌తో గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అనంతరం ఆయన పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. అనంతరం ఆయన టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన రాజకీయాలుకు దూరంగా ఉన్నప్పటికీ రైతు సమస్యలు, చెరకు సాగులు ఇబ్బందులు, షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడటం వంటి వాటిపై కొణతాల రామకృష్ణ పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ఇటీవల యాక్టివ్‌ పాలిటిక్స్ వైపు కొణతాల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పవన్‌తో భేటీ కావడంతో ఆయన జనసేనలో చేరతారని ఖరారైంది.