పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల వద్ద పులి కదలికలు గుర్తించడంతో.. గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బోడిగూడెం, డి. రావి లంక–దండంగి గ్రామాల మధ్య పులి తిరిగినట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. టెలికాలర్ సాయంతో పులి ఎక్కడ సంచరిస్తోందో ట్రాక్ చేస్తున్నారు. ట్రాన్స్మీటర్, వీఎచ్ఎఫ్ యాంటెన్నా ద్వారా సంకేతాలు స్వీకరిస్తూ పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. రెస్క్యూ బృందాలు కూడా సిద్ధంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
Also Read: Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్కే కలిసి రాలేదా?
ఇప్పటికే పులి సంచారం గుర్తించిన ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని, పశువులను మేపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిల్లలను, మహిళలను అడవుల వైపు పంపకుండా ఉండాలని కూడా హెచ్చరించారు. పులి సంచారం నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పులిని అడవుల్లోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
