CPI Narayana: ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also: Union Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్లోని ముఖ్యాంశాలు ఇవే..
ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తమపై కులం అంటగట్టారని.. సొంత చెల్లెలు షర్మిల విమర్శలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఏపీలో ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తుండడంతో జగన్ మోడీ జపం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.