రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ యాత్ర ఫలించకపోతే ప్రజలకు కష్టాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సంకల్ప్ సమ్మేళన్’ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి (PM Modi) వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల కోసం రాహుల్ తీసుకున్న నిర్ణయం సాహసోహేతమైన నిర్ణయమని కీర్తించారు.
బీజేపీ జరిగిస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాహుల్ ఈ యాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. శీతాకాలంలో వాతావరణం అనుకూలించకపోయినా ప్రజల కోసం ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వకపోతే మాత్రం మోడీకి బానిసలుగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే విపక్ష నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. జార్ఖండ్లో బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు. మోడీ ఇచ్చే బూటకపు హామీలను ప్రజలు నమ్మొద్దని మల్లిఖార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఏందీ రా సామి ఇది.. ఐరన్ మ్యాన్ బ్రదర్ లా ఉన్నాడే…