NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్..

Congress

Congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది. రేపు కొత్త సర్కారు కొలువుదీరనుంది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేల విధులు, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై వారికి అవగాహన కల్పిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిచింది. ఈసారి ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో వారితో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన తీరు, హక్కులు, బాధ్యతలు, విధులు, అసెంబ్లీ నియమ నిబంధనల గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. హోటల్ ఎల్లాలో వారికి రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.

Read Also: Cyclone Michaung: మిచాంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్.. నేడూ పలు రైళ్ల రద్దు!

అయితే, తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. అతి చిన్న వయసు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఇక, తొలిసారి ఎమ్మెల్యేగా వచ్చిన వారు.. పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, వేములవాడ నుంచి బరిలో దిగిన ఆది శ్రీనివాస్‌, రామగుండంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాగూర్‌, చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఉన్నారు. అలాగే, నాగార్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. అటు.. నాగర్‌కర్నూల్‌ నుంచి కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కే.మదన్‌ మోహన్‌ రావు, తుంగతుర్తి నుంచి ముందుల సామేల్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఆలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య, ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.