Chamala Kiran Kumar Reddy: 19 ఏళ్లుగా భూమి వివాదంలో ఉంది.. కాబట్టి అక్కడ చెట్లు పెరిగాయ్!

  • 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదే
  • 19 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న భూమి
  • అటవీ భూమిగా చిత్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
  • జింక మరణంపై ఫేక్ పోస్టులు, తప్పుడు ప్రచారం
  • కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు
Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy

హెచ్‌సీయూ 400 ఎకరాల భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ వద్ద ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని ఆయన అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేటాయించిన భూమిని వైఎస్ ఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ హయాంలో ఐఎంజీ సంస్థ వద్ద భూములున్నాయని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో పోరాడి ప్రభుత్వ భూమిని తిరిగి దక్కించుకున్నామని చెప్పారు. 19 ఏళ్లుగా భూమి వివాదంలో ఉంది కాబట్టి అక్కడ చెట్లు పెరిగాయని.. అటవీ భూములని తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు.

READ MORE: Bajinder Singh: అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు

జింక చనిపోయిందని ఫేక్ పోస్టులు పెట్టి, ట్వీట్లు డిలీట్ చేశారని ఎంపీ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ అటవీ భూమిగా చిత్రీకరిస్తూ రాజకీయం చేస్తూ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని.. పర్యావరణ వేత్తలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. హెచ్‌సీయూ కేంద్రం చేతిలో ఉందని…బీజేపీ చెప్పినట్లు రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ భూమిగా చెబుతూ విద్యార్థులను రెచ్చ గొడుతున్నారన్నారు. భూముల విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం పార్లమెంటులో వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

READ MORE: Kakani Govardhan Reddy: విచారణకు డుమ్మా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన కాకాణి..