కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
Also Read: Gold Rate Today: నేడు తులంపై రూ.870 పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో 88 వేలకు చేరువైన గోల్డ్!
హనుమకొండ పర్యటన అనంతరం రాహుల్ గాంధీ రాత్రి 7.30కు కాజీపేట నుండి రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ నుంచి రైలులో వస్తున్న విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. వరంగల్ నుంచి చెన్నై వరకు విద్యార్థులతో కలిసి రాహుల్ ప్రయాణం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు రాహుల్ గాంధీని కలిసేందుకు మధ్యాహ్నం హనుమకొండకు చేరుకోనున్నారు. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల రియాక్షన్ కాంగ్రెస్ అగ్రనేత తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది.