Congress- BJP: లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల రెండో జాబితాను రెడీ చేస్తున్నాయి. బీజేపీ తన తొలి జాబితాలోనే 16 రాష్ట్రాలకు సంబంధించిన 195 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 90 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న (సోమవారం) ఢిల్లీలో రెండోసారి సమావేశం అయింది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇక, ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలోని లోక్సభ స్థానాల్లో పార్టీ తరఫున బరిలోకి దించాల్సిన అభ్యర్థుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు టాక్.
Read Also: PM Modi : రూ.1200కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ.. నేడు శంకుస్థాపన చేయనున్న మోడీ
ఇక, ఈ సమావేశానికి ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత దుష్యంత్ చౌటాలా కలిసి ఆ రాష్ట్రంలోని సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించారు. అయితే, వాస్తవానికి హర్యానాలో జేజేపీతో పొత్తును పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ జేజేపీతోనే కలిసి వెళ్లాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయితే, మరోవైపు, పార్టీ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిన్న (సోమవారం) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఆయా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలు హాజరయ్యారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల్లోని 60కి పైగా స్థానాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. వీటిలో దాదాపు 40 మంది పేర్లను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
Read Also: Congress : కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 62 సీట్లపై చర్చ, నేడు రెండో జాబితా విడుదల!
అలాగే, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ను ఛింద్వాడా నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ ను ఆ రాష్ట్రంలోని జాలోర్ ఎంపీ స్థానంలో బరిలోకి దింపనున్నట్లు తెలుస్తుంది.. అయితే అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్లు ఈ దఫా లోక్సభకు పోటీ చేసే ఛాన్స్ లేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది.