తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిద్దడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై బోర్డు సభ్యులతో ముఖ్యమంత్రి చర్చించారు. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉండేలా సమీకృత క్రీడా కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియంను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
Also Read:Astrology: ఏప్రిల్ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్
ఇండోర్ స్టేడియం, ఔట్ డోర్ స్టేడియం, శిక్షణ పొందేందుకు అత్యాధునిక ప్రపంచస్థాయి మౌళిక వసతులతో గచ్చిబౌలి స్టేడియంను తీర్చి దిద్దాలని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్స్, ఫుట్ బాల్ స్టేడియం నిర్మించాలన్నారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ అందించేలా శిక్షణ కేంద్రాలను నిర్మించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎం బోర్డు సభ్యులకు వివరించారు.
సీఎస్ ఆర్ నిధులతో గచ్చిబౌలి స్టేడియంను అత్యద్భుతంగా అభివృద్ధి చేసేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని కోరారు. దేశంలోనే బెస్ట్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైతే వారి బ్రాండింగ్ ను ప్రోత్సహించుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. క్రీడల్లో హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలన్నారు. జూన్ 2లోగా ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్ తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
Also Read:Washington Sundar : పాపం బాస్.. 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని స్టార్ క్రికెటర్!
ఎయిర్ పోర్ట్ నుంచి క్రీడా కారులు నేరుగా హెలికాప్టర్ లో స్టేడియం చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలని, భవిష్యత్ లో స్టేడియం నిర్వహణకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి సంబంధించి ఆర్కిటెక్చర్ ను నియమించామని, స్టేడియం అభివృద్ధిపై బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీర్ఘ కాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.