అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రసంగంలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులపై కన్నెర్రజేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సోషల్ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా.. కాదు అంటే.. ఒక్కడు బయట తిరగలేడు.. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా?.. హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు.. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి.. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతా. తొడ్కలు తిస్త. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఈ సంస్కృతి విష సంస్కృతి. నన్ను తిట్టిన తిట్లకి.. మీ పేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్న. కాదు అంటే.. ఒక్కొక్కడు బయట తిరగడు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటితే .. ఊరుకోను ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తది అనుకుంటున్నారు. అవసరం ఐతే చట్టాన్ని సవరిస్తాం. ఆడ పిల్లలు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఏం బాగుంటుంది. ఇవి వింత పోకడలు. కేసీఆర్.. మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతర వేస్తా. సమస్యలు.. తప్పులు చెప్పండి. సరిదిద్దికుంటం. మీడియా సంఘాలు చెప్పండి. కుర్చీలో ఉన్న అని.. ఊరుకుంటారు అనుకుంటున్నారు. చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. విశ్రుకలత్వం ఆపండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బ తీస్తారు. చట్ట సభలో చట్టం చేద్దాం. నా ఒక్కరి ఆవేదన కాదు.. అందరి ఆవేదన. అందరూ సహకరించాలి. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి.” అని సీఎం రేవంత్ ప్రసంగించారు.