ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ అనే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రహస్య అజెండా అదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన మరో అంశమని.. కుటుంబ నియంత్రణ విధానంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాదిని శిక్షిస్తున్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని.. అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్.. విజన్ -2050, దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు కలిసి పని చేయాలనే దానిపై ముఖ్యమంత్రి ప్రసంగించారు.
తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ప్రేమిస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని.. 60 ఏళ్ల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో ప్రేమిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదు.. ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారే తప్ప వాటిని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ జీడీపీ సుమారు 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది.. 2035 నాటికి దానిని ఒక మిలియన్ యూఎస్ డాలర్లుగా మార్చాలనుకుంటున్నామని తెలిపారు. తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించామని పేర్కొన్నారు. 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల ప్రజలు నివసిస్తున్నారన్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉంది.. చార్మినార్, హైదరాబాద్ బిర్యానీ, ముత్యాలకు హైదరాబాద్ ప్రసిద్ధి అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఓఆర్ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెకార్ట్స్తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతాం..
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోని ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నామన్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం.. ఇది భారతదేశంలోని పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన (greenest, cleanest and best) నగరంగా ఉండనుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మరే నగరంతో పోల్చుకున్నా ఇది సరైన ప్రణాళిక, జోన్లు ఉన్న నగరంగా ఉండనుంది.. అలాగే ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీ అని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీలో తాము AI సిటీని నిర్మిస్తున్నామని.. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తాను పాల్గొన్నానని.. రూ.1,82,000+ కోట్లకుపైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామని చెప్పారు. గతేడాది రూ.40 వేల పెట్టుబడులు వచ్చాయి.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సాధించలేకపోయిందని విమర్శించారు.
Read Also: Warangal: కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్.. ఎమ్మెల్యే కౌంటర్
మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరింది..
హైదరాబాద్ పర్యావరణ సుస్థిరతకుగానూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసా, ఈసా నదుల కలయికే మూసీ.. గత యాభై ఏళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కి మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరిందని అన్నారు. తమ ప్రభుత్వం మూసీకి పూర్వ వైభవం తేవాలనుకుంటోందని చెప్పారు. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చనున్నాం.. అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ (భూ పరివేష్టిత రాష్ట్రం Land -locked state).. ఈ నేపథ్యంలో తాము డ్రై పోర్ట్ నిర్మించనున్నామన్నారు. దానిని ఆంధ్రప్రదేశ్లోని సీ పోర్ట్ (సముద్ర రేవు)కు ప్రత్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా కలుపుతామని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుంది.. అభివృద్ధి మొదట నగరాలతోనే మొదలవుతుందనేది తన భావన అని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ రైజింగ్ కావాలంటే అది వేగవంతమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన, అవకాశాలు కల్పించే నగరంగా ఉండాలని పేర్కొన్నారు. తాము రీజినల్ రింగు రోడ్డును, రీజినల్ రింగు రైల్వే లైను నిర్మించబోతున్నామని చెప్పారు. ఈ రెండింటిని రేడియల్ రోడ్ల ద్వారా కలపనున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.
ఎనర్జీ పాలసీ విడుదల..
తాము ఇటీవల ఎనర్జీ పాలసీని విడుదల చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈవీలపై ఉన్న అన్ని పన్నులను తొలగించాం.. ఈవీల అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 3 వేల ఆర్టీసీ బస్సులను దశలవారీగా ఈవీలుగా మార్చనున్నామని తెలిపారు. అలాగే.. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న సెమీ అర్బన్ ఏరియాను ఉత్పత్తి (మాన్యుఫ్యాక్చరింగ్) జోన్గా మార్చబోతున్నామని చెప్పారు. ఇది చైనా+1 అనే తమ వ్యూహానికి ప్రపంచానికి సమాధానంగా నిలవనుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఔషధాలు, విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ ముందువరుసలో ఉందని పేర్కొన్నారు. వాటికి అదనంగా ఎఫ్ఎంసీజీ, రక్షణ, రాకెట్స్, స్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ముందు వరుసలో నిలవాలనుకుంటున్నామని తెలిపారు. భారతదేశానికి డాటా సెంటర్ హబ్గా, పంప్ స్టోరేజీ హబ్గా తెలంగాణ నిలవనుందని అన్నారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులకు అనుసంధానమై.. దక్షిణాది రాష్ట్రాలకు ముఖ ద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంటర్గా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతులను ఆదుకుంటున్నాం..
ఆర్ఆర్ఆర్ వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న గ్రామాలను మార్చాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామాల్లోనూ అత్యుత్తమ వసతులు కల్పిస్తాం.. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులకు ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇస్తున్నాం.. భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం.. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేవలం మౌలిక వసతుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదు.. రైతులు, మహిళలు, యువత, పిల్లలు, వయోధికుల అందరి విషయంలోనూ తాము దృష్టి పెడుతున్నామని అన్నారు. తెలంగాణ రైజింగ్లో వారూ భాగమేనని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీలో రూ.10 లక్షల మేర హెల్త్ కవరేజీ ఇస్తున్నాం.. ఆరోగ్య సమస్యలతో తెలంగాణలో ఎవరైనా ఏ ఆసుపత్రికి వెళ్లినా తాము చూసుకుంటున్నామని అన్నారు.
Read Also: Sumanth : నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సుమంత్ ‘‘అనగనగా’’
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం..
విద్యా, నైపుణ్యాలు తన ప్రథమ ప్రాధాన్యాలు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అన్ని గురుకులాల్లో మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను రెట్టింపు చేశామని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించామని వెల్లడించారు. అక్కాచెల్లెళ్లు ఇప్పటికే కోట్లాది బస్సు ప్రయాణాలు ఉచితంగా చేశారు.. ఎంతో డబ్బును ఆదా చేసుకున్నారన్నారు. అక్కా చెల్లెళ్లకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. ఇళ్లకు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఇళ్లు నిర్మించనున్నాం. 20 లక్షల పేద కుటుంబాలు సొంత ఇళ్ల కల నెరవేరుతుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలకు సామాజిక న్యాయం చేస్తామని తమ నాయకుడు రాహుల్ గాంధీ అభయమిచ్చారన్నారు.
సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ..
సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ.. దానిని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా దామాషా ప్రాతిపదికన తాము వనరులు సమకూర్చుతామన్నారు. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగ సోదరసోదరీమణులు పోరాడుతున్నారు.. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ చేపట్టాలని తాము 2024 ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2025 ఫిబ్రవరి 4న ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి దాని అమలుకు తీర్మానం చేశామని సీఎం వెల్లడించారు. ఫిబ్రవరి 4వ తేదీన ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోనున్నామని చెప్పారు. సుపరిపాలన ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుందనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్లోబల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో వినియోగంలో తాము ప్రథమ స్థానంలో ఉన్నామని అన్నారు. తలసరి ఆదాయంలోనూ తాము ప్రథమ స్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. ఇప్పుడు మీ అందరిని ప్రశిస్తున్నాం.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్రయోజనం కాదా..? అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదు.. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.