నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంకు సీఎంతో పాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. స్పోర్ట్స్ మీట్లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం ఆరంభం కానుంది. ఏపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ నేటితో ముగియనుంది.
లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో కళాకారులు పలు కళాకృతులు ప్రదర్శించనున్నారు. సంస్కృతిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు భాగం పంచుకోనున్నారు. సీఎం చంద్రబాబు నేడు క్రీడలు ఆడే అవకాశం ఉంది. ‘ఇవాళ సాయంత్రం విజయవాడలో సభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరు అవుతారు. క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ఈరోజు తెలిపారు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ఫుల్ చిల్.. ఒక్క రాత్రికి రూ.23 లక్షలు!
శాప్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 13 రకాల ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రీడల కోసం రిఫరీలు, అంపైర్లు, సహాయకులు.. మొత్తంగా 200 మంది సిబ్బందిని నియమించారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా.. క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 140 మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా..13 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతిరోజు అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిశాక స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయి.