కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం (జనవరి 4) హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఇటీవల మరణించిన టీడీపీ నేత సాయి బాబా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నదీ జలాల అంశంపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. త్వరలోనే కృష్ణా జలాలపై మాట్లాడుతానని చంద్రబాబు తెలిపారు. దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తానని చెప్పారు. దీంతో చంద్రబాబు ఏం మాట్లాడుతారనే దానిపై అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ ఉత్కంఠ నెలకొంది.