NTV Telugu Site icon

BRS vs Congress: ఖమ్మంలో ఉద్రిక్తత.. హరీష్‌ రావు కారుపై రాళ్ల దాడి

Brs Vs Congress

Brs Vs Congress

BRS vs Congress: ఖమ్మంలోని బీకే నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హరీష్‌ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌ నేతల కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరరావు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఖమ్మంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిసింది.

Read Also: Etela Rajender: కొట్టుకుపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి..

అనంతరం మాజీ మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. జనజీవనం అతలాకుతలం కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెప్పారు. రేవంత్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని, సకాలంలో స్పందించ లేదని విమర్శించారు. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం వల్లనే జరిగిందని మండిపడ్డారు. పార్టీ తరపున కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ తరఫున సహాయం అందించేందుకు వచ్చామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చామన్నారు. పరిస్థితి హృదయ విదారకంగా ఉందన్నారు. పాలు దొరకక పసి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Read Also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..

ప్రభుత్వం హెలికాప్టర్‌ పంపలేకపోయిందని విమర్శించారు. సీఎం పాలనపై పట్టు తప్పారని ఆరోపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి ఆనాడు రూ.25 లక్షలు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారని.. అవే చనిపోయిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలం అయ్యిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 16 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని, కానీ రాష్ట్రంలో 30 మంది చనిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సాగర్‌ కెనాల్ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర, కేంద్ర నిర్లక్ష్యానికి మహబూబాబాద్, ఖమ్మం ప్రజలు బలైపోయారన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షాన్నే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.