NTV Telugu Site icon

Prajavani: ప్రజావాణిలో ఇప్పటివరకు 5,23,940 దరఖాస్తులు.. 4,31,348 పరిష్కారం

Prajavani

Prajavani

Prajavani: ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు. కేవలం ప్రజాభవన్‌లో నమోదైన దరఖాస్తుల సంఖ్య దాదాపు 60 వేలుగా ఉందన్నారు.ఇప్పటివరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పించాలనే విజ్ఞప్తులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేయని వారు కూడా ప్రజాభవన్‌కు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారని చెప్పారు.

Read Also: Kishan Reddy: ఈనెల 11 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా.. విజయవంతం చేయాలి..

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కోర్టుల పరిధిలో ఉన్న అంశాలు మినహా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అన్ని విభాగాలు అక్కడికక్కడే పరిశీలిస్తున్నాయన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మ జ్యోతిభాఫూలే భవన్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడి అర్జీ రాయటం రాని వాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడున్న సిబ్బంది అర్జీదారులకు సమస్యను తెలుసుకొని అర్జీ రాసిస్తారు. తమ సమస్యను ఏ విభాగానికి అందించాలో కూడా అధికారులు సాయం చేస్తారు. ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రజావాణిలో విభాగాల వారీగా ప్రత్యేక డెస్క్లను ఏర్పాటు చేశారు. రెవిన్యూ నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహతీల్దార్, సీసీఎల్ఏ అధికారులు, పోలీస్ విభాగం నుచి సీఐ, డీఐజీ, డీసీపీ ర్యాంకు అధికారులు, హెల్త్ తో పాటు అన్ని సంక్షేమ విభాగాల నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి అదికారులు ప్రజావాణి డెస్క్‌లలో అందుబాటులో ఉంటారు.

ఆరోగ్య శ్రీ జనరల్ మేనేజర్ అధ్వర్యంలో ఆరోగ్య శ్రీ డెస్క్ ఉంటుంది. అత్యవసర సేవల నిమిత్తం మెడికల్ హెల్ప్ డెస్క్, అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది. మహిళా బాధితులకు తోడుగా ఉండేందుకు సఖి వాహనం, పిల్లలకు బాలారక్ష అంబులెన్స్లు ఇక్కడే ఉంటాయి. దివ్యాంగుల అర్జీల స్వీకరణకు ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను, వినతులను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు రూ.5 కే భోజనం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ దివ్య, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండీ పర్యవేక్షిస్తారు. అర్జీదారులు ఇచ్చే దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ప్రజావాణిలో ఇచ్చే ప్రతి దరఖాస్తును అక్కడే స్కాన్ చేస్తారు. రిఫరెన్స్ ఐడీ నెంబర్ నమోదు చేసి సంబంధిత విభాగానికి పంపిస్తారు. అర్జీదారుని ఫోన్ నెంబర్ కు ఆ పిటిషన్కు సంబంధించిన రిఫరెన్స్ ఐడీ నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తారు.

Read Also: CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..

గతంలో ఒకే అర్జీదారుడు రెండు మూడు సార్లు వచ్చే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య అభిప్రాయపడ్డారు. వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఒకవేళ ఒకే అర్జీదారుడు ఒకే వినతిపై రెండు మూడు సార్లు ప్రజావాణికి వస్తే తెలిసిపోయేలా ఆన్లైన్ విధానం అమల్లో ఉంది. అర్జీదారు మొబైల్ నెంబర్ నమోదు చేయగానే తన పిటిషన్ స్కాన్డ్ కాపీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. దీంతో ఆ విజ్ఞప్తి ఏ స్థాయిలో ఉందో అర్జీదారులకు తెలియజేసి పంపిస్తున్నాం..’ అని చెప్పారు. ప్రజావాణిలో అర్జీదారులు తమ పిటిషన్ల స్టేటస్ను కూడా వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. అందుకు వీలుగా సీజీజీ ద్వారా ప్రత్యేక పోర్టల్‌ను ప్రభుత్వం డెవలప్ చేయించింది. గతంలో ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చేందుకు సామాన్యులు నానా తంటాలు పడేవారు. సెక్రెటేరియట్‌తో పాటు చాలా విభాగాల హెడ్ ఆఫీస్ లకు అనుమతి ఉండేది కాదు. అధికారులను కలిసి తమ విజ్ఞప్తులు అందించే వెసులుబాటు ఉండేది కాదు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవియన్స్ డే నిర్వహించేవారు. కానీ అక్కడికి వచ్చే వినతులను పరిష్కరించే విధానాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో చాలా జిల్లాల్లో గ్రీవియెన్స్ డే తూతూ మంత్రంగా మారింది. వేలాది మంది బాధితులు ప్రతి వారం గ్రీవియన్స్ సెల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. జిల్లాల్లో పరిష్కారం కాని అర్జీలను రాష్ట్ర స్థాయిలో చెప్పుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం నియంత్రించింది.