China- India: 2024 లోక్సభ ఎన్నికల మధ్య భారత్లో చైనా తన రాయబారిని నియమించుకోనుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. 18 నెలల తర్వాత చైనా ఈ నియామకాన్ని చేపట్టింది. సీనియర్ దౌత్యవేత్త జు ఫీహోంగ్ పేరును అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆమోదించారని.. అయితే, త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం చైనా ఉప విదేశాంగ మంత్రిగా ఉన్న సన్ వీడాంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఫీహాంగ్ నియామకానికి సంబంధించి చైనా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే, ఆఫ్ఘనిస్తాన్, రొమేనియాలో చైనా రాయబారిగా ఉన్న ఫీహాంగ్ ఇప్పుడు భారతదేశానికి కొత్త రాయబారిగా బాధ్యతలను నిర్వహించబోతున్నారని డ్రాగన్ కంట్రీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పీటీఐకి ధృవీకరించింది. కాగా, ఫీహాంగ్ త్వరలో న్యూఢిల్లీకి వెళ్లి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Read Also: SRH vs LSG: ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్కు చావోరేవో.. గెలిస్తేనే ఆశలు!
అయితే, భారత్- చైనాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యసంబంధాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇక, మే 5, 2020న తూర్పు లడఖ్లోని పెగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య వాణిజ్యం మినహా ఇతర ద్వైపాక్షిక సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇప్పటి వరకు 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. కాగా, చైనీస్ ఆర్మీ ప్రకారం.. గాల్వాన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్, హాట్ స్ప్రింగ్, జియానాన్ దబన్ (గోగ్రా) ప్రాంతం అనే నాలుగు పాయింట్ల నుంచి భద్రతా దళాలను ఉపసంహరించుకోవడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. దేప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై భారత్ ఒత్తిడి తెస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా చైనాతో సంబంధాలు సాధారణంగా ఉండలేవని భారత్ అంటోంది.