కుల గణన సర్వే నేటితో ముగియనుందని.. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలని కోరారు. ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో.. అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. కుల గణనలో పాల్గొనని వారికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
‘కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చింది. సర్వే గడువు నేటితో గడువు ముగుస్తుంది. సర్వేలో పాల్గొనని వారికి నేడు చివరి రోజు. పాల్గొనని వారికి కుల గణన సర్వేలో పాల్గొని సమాచారం ఇవ్వండి. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే.. కుల గణన సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను ఏర్పాటు చేయడం జరిగింది. తాము కుల సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి.. ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
‘ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు https://seeepcsurvey.cgg.gov.in ద్వారా తమ సమాచారాన్ని ఇవ్వవచ్చు. అందుతున్న పథకాలు అర్హులుగా ఉండాలి. ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో.. అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలి. వారు ఈరోజు కుల సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మీదే. సర్వేలో పాల్గొనని వారిని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.