Talasani Srinivas Yadav : బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు..

  • బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే కోసం 57 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అనేక అంశాలు ఉండడంతో చాలా మంది సర్వేలో పాల్గొనలేదు. గ్రేటర్‌ పరిధిలో 30 శాతం మంది సర్వేలో పాల్గొనలేదు. సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది.- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై బీఆర్ఎస్ కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు అన్యాయం చేసేలా సర్వే రూపొందించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుషించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సర్వే కోసం 57 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, దీనివల్ల అనేక మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేకపోయారని తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొనలేదని పేర్కొన్నారు. ఇది ప్రజల్లో అసంతృప్తిని కలిగించే అంశమని విమర్శించారు.

Mohammed Shami: ప్రపంచ రికార్డుకు దగ్గరలో టీమిండియా స్టార్ బౌలర్..

సర్వే ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గినట్టు ప్రచారం జరుగుతోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో 90 శాతం మంది బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగకూడదని, ప్రభుత్వం వారి హక్కులను హరిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.

తలసాని మాట్లాడుతూ, అసెంబ్లీలో ఏం జరుగుతుందో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, సమావేశాల షెడ్యూల్ ఇచ్చి మాట తప్పడం అన్యాయమన్నారు. నిన్న కేబినెట్ సమావేశం పెట్టుకుంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. సభలో తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సభను వాయిదా వేయడానికి ముందు విపక్షాన్ని ఒక్క మాటైనా అడగరా?” అని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కుట్రపూరితంగా అభివర్ణించారు. కేవలం ఒక రోజే సభను నిర్వహించడం దారుణమని, కనీసం నాలుగు రోజులు అయినా సభ జరపాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశమే ఉందని అనిపిస్తోందని తలసాని అన్నారు. తెలంగాణలో బీసీలు చైతన్యవంతులుగా మారారని, తమ హక్కులను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. “కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. బీసీల కోసం మరో ఉద్యమం రాబోతోంది. ఇది తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి” అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు.

Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..