KTR: ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటిదని, కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర సర్కారు అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
Read Also: Deputy CM Bhatti Vikramarka: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్.. డిప్యూటీ సీఎం ఆదేశాలు
బీజేపీ ఆఫీస్లో తయారైన రిపోర్టుని ఎన్డీఎస్ఏ ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. పోలవరం కొట్టుకుపోతే ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పది లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా మేడిగడ్డ చెక్కుచెదరకుండా ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి అబద్దాలు ప్రచారం చేసి కేసీఆర్ని గద్దె దింపారని అన్నారు. ఇక రాజకీయాలు మానండి… ప్రజల కోసం పని చేయండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ కుంగడంపై మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏదైనా చేసే ఘనులు, సిద్ధహస్తులు అంటూ ఆరోపించారు. ఇప్పుడు మేము వచ్చి మేడిగడ్డ బానే ఉంది అంటున్నామని భవిష్యత్లో ఏదైనా చేయొచ్చని ఆరోపణు చేశారు. ఇప్పటి బ్యారేజ్ పరిస్థితిని చూడండి… భవిష్యత్లో ఏదైనా జరిగితే మేము చెప్పింది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.