Andhra Pradesh Minister Botsa Satyanarayana About Union Government Released Ration Rice.
రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం పెట్టిందన్నారు. కేంద్రం పథకానికి 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందని, మేము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామని తెలిపారు. ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుండి పునరాలోచన చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించామని, కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అందుకే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో వారికి అందిస్తామని, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు మినహాయించి ప్రకాశం జిల్లాకు అందిస్తున్నామన్నారు. కోటి 67 లక్షల మందికి కేంద్రం ఇచ్చిన బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని, మిగిలిన జిల్లాల్లోని ఎస్సి, ఎస్టీ వర్గాలకు కూడా 89 లక్షల 20 వేల మందికి ఇస్తామన్నారు. ఏఏవై కార్డులున్న వారికి కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి ఈ బియ్యం అందిస్తామని, ప్రతి నెలా ఇచ్చే రేషన్కి అదనంగా కేంద్రం ఇచ్చే రేషన్ ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు. డోర్ డెలివరీ విధానంలో రెగ్యులర్గా ఇచ్చే బియ్యం ఇస్తామని, కేంద్రం ఇచ్చేది రేషన్ షాప్ లకు వెళ్లి తీసుకోవాలన్నారు. మేము ఇంటింటికి ఇచ్చే బియ్యం సోర్టెక్స్ బియ్యమని, కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం నాన్ సోర్టెక్స్ బియ్యమని ఆయన వివరించారు.