NTV Telugu Site icon

Odisha: నవీన్ పట్నాయక్‌తో పొత్తుపై బీజేపీ క్లారిటీ

Modi

Modi

ఒడిశాలో బీజేడీతో బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది రోజులుగా బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుందని వార్తలు వినిపించాయి. ఇటీవల ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీతో పొత్తు పెట్టుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

త్వరలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు మన్మోహన్ సమాల్ స్పష్టం చేశారు. 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ఆయన తేల్చి చెప్పారు. మోడీ సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపించబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధఇ కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి వస్తున్న సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు చేరకుండా పోతున్నాయని మన్మోహన్ సమాల్ నవీన్ పట్నాయక్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

మొత్తానికి ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీతో బీజేపీ పొత్తు లేదని తేలిపోయింది. ఇక ఆ రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బీజేపీ నాలుగు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాల్గో జాబితాలో 15 మంది అభ్యర్థులను వెల్లడించింది. మొత్తం ఇప్పటి వరకు 291 స్థానాల్లో అభ్యర్థులకు కాషాయ పార్టీ ఖరారు చేసింది.

ఇది కూడా చదవండి: Elephant Attack: జరైతే ప్రాణాలు పోయేవే.. టూరిస్టుల వాహనాన్ని ఎత్తిపారేసిన ఏనుగు.. వైరల్ వీడియో..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.