NTV Telugu Site icon

Donald Trump: బైడెన్‌ను రేసు నుంచి తప్పించడం ఓ కుట్ర.. మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్

Trump

Trump

Donald Trump: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎన్నిక ప్రచారం సందర్భంగా జో బైడెన్‌తో జరిగిన డిబేట్‌ తన గొప్ప చర్చల్లో ఒకటని అభిప్రాయపడ్డారు. ఆ డిబేట్‌లో బైడెన్‌ను చిత్తుగా ఓడించానని.. దాని ప్రభావంతోనే డెమోక్రాట్లు కుట్ర చేసి ఆయనను పోటీ నుంచి తప్పించారని ఆరోపణలు చేశారు. ప్రచార సభలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. హత్యాయత్నం నుంచి బయటపడ్డ తర్వాత దేవుడిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. కాల్పులు జరిగినపుడు తల తిప్పడమే తనను కాపాడిందని, బుల్లెట్ గాయం తర్వాత వెంటనే తనపై కాల్పులు జరిపారనే విషయం అర్థం చేసుకున్నానని వివరించారు. ఆ క్షణమే తేరుకున్నానని, మళ్లీ ప్రసంగం కొనసాగించాలని భావించగా.. సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పారని తెలిపారు.

Read Also: Manu Bhaker-Neeraj Chopra: మను బాకర్‌ ఇంకా చిన్నపిల్ల.. పెళ్లి వయసు రాలేదు: మను తండ్రి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు తమ ఆటల్లో టాప్‌లో ఉన్నారని ట్రంప్ అన్నారు. వారంతా తమ దేశాలను ప్రేమస్తున్నారని చెప్పారు. వారిది భిన్నమైన ప్రేమ అంటూ పేర్కొన్నారు. వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ లేకపోతే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేదే కాదన్నారు. పుతిన్‌తో చాలా సార్లు మాట్లాడానని.. ఆయన తనకు చాలా గౌరవమిస్తారని చెప్పారు. ఉక్రెయిన్ గురించి కూడా తాము చర్చించుకున్నామన్నారు. అమెరికా సరిహద్దు వివాదాలు, వలసదారులకు అడ్డుకట్ట వేయడంపై ట్రంప్ స్పందిస్తూ.. బార్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశాలు తమ దేశంలోని నేరస్థులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని అమెరికాకు పంపిస్తున్నాయని ఆరోపించారు. దేశంలోకి అక్రమ వలసలను కఠినంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ కూడా అంగీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు అసలు ఐక్యూయే లేదని ట్రంప్ విమర్శించారు. బైడెన్ కు ఐక్యూ చాలా తక్కువని గతంలో తాను చెప్పానన్న ట్రంప్.. ఆయన పాలన చూశాక అసలు బైడెన్ ఐక్యూ జీరో అని అర్థం చేసుకున్నానని వివరించారు.

డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అధ్యక్షుడు ఉన్నా లేనట్టేనని.. కమలా హారిస్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఆమె గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. ఆమెను గెలిపిస్తే 50 నుంచి 60 మిలియన్ల అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తారని.. వారంతా అతివాద భావజాలంతో ఉంటారని.. నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. తాను అధికారంలోకి వస్తే చట్టాలను కఠినంగా అమలు చేస్తానని ట్రంప్ వెల్లడించారు. చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బహిష్కరణల ప్రక్రియ చేపడతానని చెప్పారు. ఉద్యోగాలను సృష్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎక్స్‌లో ప్రసారమై ఈ లైవ్ ఇంటర్వ్యూకు తొలుత సాంకేతిక సమస్య ఎదురవ్వగా.. 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా చాలా మంది వినియోగదారులకు ఇంటర్వ్యూ ఆడియో వినిపించలేదు. ఇందుకు డీడీఓఎస్‌ అటాక్‌ కారణమని మస్క్‌ తెలిపారు. అయినప్పటికీ 2.7 కోట్ల మంది వీరి సంభాషణను విన్నారు. మస్క్ తో ఇంటర్వ్యూ జరుగుతుండగా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో తన ట్విట్టర్ ఖాతాను నిషేధించడంతో ట్రంప్ సొంతంగా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకున్నారు. ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్రంప్ పై నిషేధం ఎత్తివేశారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పలు ట్వీట్లు చేశారు.