Uddav Thackeray: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు. శివసేన (యూబీటీ) పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణించారు. ఇది నియంతృత్వ అంతానికి నాంది అని అన్నారు. ప్రస్తుతం దొంగను దొంగ అని పిలవడం నేరంగా మారిందని, అయితే దేశాన్ని దోపిడీ చేసేవారు బయటే ఉన్నారని ఉద్ధవ్ థాక్రే ఒక ప్రకటనలో అన్నారు. “ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. అన్ని ఏజెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. ఇది నియంతృత్వ ముగింపుకు నాంది.. యుద్ధానికి ఒక దిశ మాత్రమే అవసరం ” అని థాక్రే అన్నారు.
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజే, లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని లోక్సభ నుంచి అనర్హులుగా ప్రకటించడం గమనార్హం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇది రాహుల్ను దోషిగా నిర్ధారించిన రోజు మార్చి 23 నుండి అమలులోకి వస్తుంది.
Read Also: Amruta Fadnavis: అమృత ఫడ్నవీస్కు లంచం ఇచ్చేందుకు యత్నం.. మహిళకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
“కోర్టు ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సూరత్ ఆయనను దోషిగా నిర్ధారించిన తర్వాత.. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన తేదీ నుంచి అంటే 23 మార్చి, 2023 నుండి లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు.” నోటిఫికేషన్ పేర్కొంది. రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.