Gautam Gambhir Likely To Appoint Team India Head Coach Soon: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎంపికపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక అప్డేట్ ఇచ్చారు. జులై నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైన కొత్త కోచ్తోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా చెప్పారు. అయితే కోచ్గా ఎవరు ఎంపికయ్యారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియగా.. బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్ పేర్లను షార్ట్లిస్ట్ చేశారు.
గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్లకు ఇటీవల క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. త్వరలోనే టీమిండియా కొత్త కోచ్ పేరును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. గంభీర్ను హెడ్ కోచ్గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో జై షా కొత్త హెడ్ కోచ్ అంశంపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డే సిరీస్లు జరగనున్నాయి. జులై 27 నుంచి ఈ టూర్ మొదలవ్వనుండగా.. ఈ పర్యటనతోనే కొత్త కోచ్ జట్టుతో కలుస్తాడని జై షా చెప్పారు. జులై 6 నుంచి మొదలయ్యే జింబాబ్వే టీ20 సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చారు.
Also Read:
రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. 2021నవంబర్లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగారు. నిజానికి 2023 వన్డే ప్రపంచకప్ నాటికే ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కానీ 2024 టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో మరో 6 నెలల పాటు పదవిలో ఉండాలని బీసీసీఐ కోరింది. ద్రవిడ్ మార్గనిర్ధేశంలో భారత్ ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. ఇక కొత్తగా ఎంపికయ్యే కోచ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ పదవిలో ఉంటాడు.