Basara IIIT: బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగించారు. నేటితో(జూన్ 19) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా.. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు 22 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దివ్యాంగులు, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఆరేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను జులై 3న విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
Read Also: Jagadish Shettar: కర్ణాటక ఎమ్మెల్సీ ఉపఎన్నికల బరిలో జగదీష్ షెట్టర్
బాసర ఆర్జీయూకేటీలో 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు మే 31 నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.