Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.

  • సీఎం సువేందును కొద్దిగా ఆపాలని కోరిన బంగ్లాదేశ్ ఎంపీ..
  • ఆయన వ్యాఖ్యలతో భారత్-బంగ్లా సంబంధాల్లో ఇబ్బందులు..
  • బంగ్లాదేశ్ పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేత..
Suvendu Adhikari

Suvendu Adhikari

Bangladesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి నిర్ణయాలు, వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లు అత్తగారి ఇంటిలా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కు వలసలు సాగేవి. బీజేపీ ప్రభుత్వ రాకతో అక్రమ చొరబాటుదారులు సొంత దేశానికి పారిపోతున్నారు. ఇదే కాకుండా, బంగ్లాదేశీయుల్ని హెచ్చరిస్తూ సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిపై బంగ్లాదేశ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై బంగ్లా పార్లమెంట్‌లో కీలక చర్చ జరిగింది. అధికార బీఎన్పీ ఎంపీ గులాం మహహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. బెంగాల్ సీఎం సువేందు అధికారి చేస్తున్న వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను కట్టడి చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. సీఎం సువేందు తరుచుగా బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన చేస్తున్న ప్రకటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని అన్నారు. ‘‘ నేను స్పీకర్ ద్వారా భారత ప్రభుత్వానికి చెప్పాల్సింది ఒకటే. పశ్చిమ బెంగాల్ నాయకుడు సువేందు బాబును అడ్డుకోవాలి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు భారత్-బంగ్లా స్నేహానికి అనుకూలంగా లేవు’’ అని అన్నారు.

మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాల్లో అంశం కాదని, ఆమెకు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. షేక్ హసీనా ముగిసిన అధ్యాయం అని అన్నారు. ఆమె గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని ఎంపీ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేయాలని సూచించారు. ఇద్దరు స్నేహితులు, భార్యభర్తలు విడిపోవచ్చు, కానీ ఇరుగుపొరుగు మధ్య ఉన్న సంబంధాలకు విడాకులు ఉండవని, బంగ్లాదేశ్-భారత్ ఎప్పటికీ పొరుగుదేశాలుగానే ఉంటాయని అన్నారు.