బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్లోని ప్రత్యేక కోర్టు ఆమెకు రెండు అవినీతి కేసుల్లో మొత్తం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు సోమవారం (ఫిబ్రవరి 2, 2026) ఢాకా స్పెషల్ జడ్జ్ కోర్టు-4లో జడ్జి రబిఉల్ ఆలం ఇచ్చారు. రాజధాని ఢాకా శివార్లలోని పుర్బాచల్లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ నివాస స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. 79 ఏళ్ల హసీనా తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి తన బంధువులకు చట్టవిరుద్ధంగా భూమిని కేటాయించారని కోర్టు గుర్తించింది.
Also Read:Pawan Kalyan: అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్!
ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు-4లోని జడ్జి రబియుల్ ఆలం హసీనాతో పాటు ఆమె సన్నిహితులకు కూడా శిక్ష విధించారు. హసీనా మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్, ఆమె సోదరుడు రద్వాన్ ముజిబ్ సిద్ధిక్ “బాబీ”, సోదరి అజ్మాన్ సిద్ధిక్లకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మందిని గైర్హాజరీలో విచారించారు. ఇతర దోషులలో మాజీ గృహనిర్మాణ మంత్రి, మాజీ కార్యదర్శి, RAJUK మాజీ ఛైర్మన్ ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఒక సీనియర్ అధికారి ఖుర్షీద్ ఆలం మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.
Also Read:Pawan Kalyan: జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. తీరు మార్చుకోకపోతే ఉపేక్షించం!
రాజకీయ ప్రతీకార చర్యనా లేక చట్టపరమైన ప్రక్రియనా? షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ ఈ తీర్పును “ఊహించదగినది” అని, ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కల్పించిన “తప్పుడు, దురుద్దేశపూరిత” కేసు అని అభివర్ణించింది. బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్ ఈ మొత్తం ప్రక్రియను “హాస్యాస్పదం” అని అభివర్ణించారు. తనకు ఎటువంటి అధికారిక సమన్లు లేదా ఛార్జ్ షీట్ అందలేదని, న్యాయ సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆగస్టు 2024 తిరుగుబాటు నుండి హసీనా భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు గతంలో ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. గత నవంబర్లో, మరో అవినీతి కేసులో అతనికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.