Bandi Sanjay : పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలో దారుసలామ్ మీటింగ్ పెట్టడం అన్యాయమే కాదు, పేద ముస్లింలకు గుణపాఠం చెబుతోందని మండిపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పేద ముస్లింల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
వక్ఫ్ బిల్లును పేద ముస్లింల కోసం తీసుకువచ్చినట్లు చెప్పిన సంజయ్, “బడాబాబులు, బడా చోర్లు కలిసి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఎవరి కోసం? పేదల కోసం కాదు!” అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అలాగే, బాబా సాహెబ్ అంబేద్కర్ పై అవమానం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. “ఎంఐఎం ఏదైనా ఒక్కసారైనా అంబేద్కర్ జయంతి, వర్థంతి చేసింది? ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా?” అంటూ ప్రశ్నించారు. వక్ఫ్ భూములపై వివరణ ఇస్తూ, “హర్యానాలో సిక్కుల దేవాలయం, రైల్వే స్టేషన్, పార్లమెంటు భవనాలపై వక్ఫ్ హక్కులు అంటున్నారు. అయోధ్యలో రాముడి పుట్టిన స్థలానికి ఆధారం అడుగుతున్నారు. మీ జాతికి ఒక న్యాయం, మా జాతికి ఇంకో న్యాయమా?” అని కేంద్ర మంత్రి నిలదీశారు.
సుప్రీంకోర్టుపై తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన బండి సంజయ్, “మేము ఎప్పటికీ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వెళ్లం,” అని అన్నారు. తెలంగాణ సీఎం విదేశీ పర్యటనలపై సెటైర్లు వేసిన సంజయ్, “జపాన్, దావోస్ వెళ్లి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. వాటిలో ఒక్కటి అన్న చూపించండి,” అని సవాల్ విసిరారు. ఇకపోతే, ఇటీవల వడగళ్ల వానలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్న ఆయన, “ఎంత మంది రైతులకు పరిహారం ఇచ్చారు? గతంలో ఎంత ఇచ్చారు? ఇప్పుడేం చేస్తున్నారు?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.