‘‘రేవంతన్నా… నేను 6 గ్యారంటీల సంగతేమైందని అడిగితే… గుండు, అరగుండ అంటూ హేళనగా మాట్లాడతవా? 5 ఏళ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివ్రుద్ధికి తెచ్చిన నిధులు నీ కళ్లకు కన్పించడం లేదా?’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ‘‘మీరెన్ని డ్రామాలాడినా, ఎంతగా హేళన చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే సీట్లు గుండు సున్నా’’అని ఎద్దేవా చేశారు. కొద్దిసేపటి క్రితం సిరిసిల్ల పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంటలో ఈరోజు నిర్వహించిన సీఎం బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని, ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో తిడుతూ ప్రజల ద్రుష్టిలో మరింత చులకన అవుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే…
జమ్మికుంటలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. జనం లేక వెలవెలపోయింది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నిరాసక్తతకు, తిరస్కరణకు నిదర్శనమిది. జమ్మికుంట సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఆయన ఉపయోగిస్తున్న భాష జుగుప్సాకరం. సీఎం హోదాలో ఉంటూ దిగజారి మాట్లాడటం సిగ్గు చేటు. మేధావి వర్గం, సామాన్య ప్రజలు సీఎం మాటలపై చర్చ జరుగుతోంది.
సీఎంకు నా గుండుతో పనేంది? నాది అరగుండా? గుండా? అనేది నీకెందుకు? గాడిద గుడ్డు, అరగుండు, గుండు సున్నా అంటూ వ్యక్తిగతంగా కించపర్చడం సిగ్గు చేటు. తెలంగాణలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ లో నేను చేసిన పోరాటాలు కన్పించడం లేదా? నా గుండు మాత్రమే నీకు కన్పిస్తుందా?
నువ్వెంత హేళన చేసినా పట్టిచుంకోను. ఆరు గ్యారంటీల సంగతి చెప్పు. వంద రోజుల్లో మహిళల అకౌంట్లో ప్రతినెలా రూ.2500 లు ఇస్తానన్నవ్. ఏమిచ్చినవ్. గాడిద గుడ్డు, గుండు సున్నా. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తానన్నవ్… ఏమిచ్చినవ్? గాడిద గుడ్డు, గుండు సున్నా తప్ప? వడ్లకు బోనస్ ఇస్తానన్నవ్? తులం బంగారం ఇస్తానన్నవ్? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా ఇస్తానన్నవ్. వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తానన్నవ్? ఏమిచ్చినవ్.. గాడిద గుడ్డు.. గుండు సున్నా… ఎన్నికల్లో మీ పార్టీకి వచ్చేది గుండు సున్నా…
మీకు దమ్ముంటే 6 గ్యారంటీలపై చర్చించు. వాటిని ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరించు.. ఇప్పటికే హామీలను అమలు చేయకపోవడంతో జనం తిరగబడుతున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ది రావడం లేదు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా ప్రజలకు తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్ధం కావడం లేదు…
మేం శ్రీరాముడి గురించి మాట్లాడుతుంటే.. దేవుడి పేరు చెప్పుకోవడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డికి.. దేవుడి మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తానంటున్నడు. చివరకు ఆయనకు దేవుడే దిక్కయ్యిండు.. మేం పక్కా రాముడి వారసులం. బరాబర్ మాట్లాడతాం. కాంగ్రెస్ ది ద్వంద్వ విధానం. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో ఒక వర్గం ఓట్లు దండుకుంటున్నరు.
మీ లెక్క తెలంగాణ ఉద్యమం చేస్తానంటే తుపాకీతో కాల్చేస్తానని నేను అనలే… ఢిల్లీలో టియర్ గ్యాస్, వాటర్ వదిలినా వెనుకంజ వేయకుండా జై తెలంగాణ అని గర్జించి గాండ్రించిన నాయకుడిని నేను. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవడం తథ్యం. కరీంనగర్ లో భారీ మెజారిటీ ఖయాం.’ అని బండి సంజయ్ అన్నారు.