భారీ వర్షాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరద దాటికి ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లా్ల్సి వచ్చింది. అయితే.. రాష్ట్రంలో కురిసిన వర్షాలపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అలర్ట్ చేసినా….ముందస్తు చర్యలేవి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిదని, దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది సర్కార్ తీరన్నారు. ఇంతవరకు సీఎం కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని, ముందే మేల్కొని ఉంటే ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు బండి సంజయ్. అంతేకాకుండా.. ‘రాష్ట్ర అధికారులు కష్టపడుతున్నా… సర్కార్ నుండి ఆశించిన సహకారమేది? ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగేదాకా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలెందుకు తీసుకోలేకపోయారు? చనిపోయిన కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన వారికి రూ.10 లక్షలివ్వాలి. యుద్ద ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు తీసుకోవాలి. ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల తెలంగాణలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే 20 మంది చనిపోయారు. మరో 25 మంది గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ లేదు. వేలాది సంఖ్యలో పశువులు చనిపోయాయి. వేలాది ఇండ్లు మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం జరిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదలవల్ల మరణాలు సంభవించాయే తప్ప భారీ వర్షాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ చనిపోయిన దాఖలాల్లేవు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే. దొంగలు పడ్డ అర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు.
భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ముంపు బాధిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముందే మేల్కొని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశముండేది. కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగేవరకు రాష్ట్ర బృందాలు ముంపు ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయాయి. రాష్ట్ర అధికారులు కష్టపడుతున్నా ప్రభుత్వం నుండి సరైన సహకారం అందకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ అనేక జిల్లాల ప్రజలు భారీ వర్షాలతో అల్లాడుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిది.
ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలి. బీజేపీ కార్యకర్తలంతా ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. అందులో భాగంగా ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నా.’ అని బండి సంజయ్ వెల్లడించారు.